హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా పుంజుకోవడంతో తెలంగాణలో వర్షాల జోరు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 23 నుండి జూన్ 28 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ హైదరాబాద్ కేంద్రం రాష్ట్రానికి భారీ వర్షాల హెచ్చరిక (Heavy Rainfall Warning) జారీ చేసింది. రుతుపవనాల కదలికలు చురుగ్గా మారడంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. జిల్లాల వారీగా వాతావరణ హెచ్చరికలు:జూన్ 23 - 24: ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూన్ 25: వర్షాల ప్రభావం మరింత పెరిగి జగిత్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు విస్తరించనుంది. జూన్ 26 నుండి 28: రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణం నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈదురు గాలులు.. తగ్గుముఖం పట్టనున్న ఉష్ణోగ్రతలు భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. నిరంతరాయంగా కురిసే వానల కారణంగా రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గే అవకాశం ఉంది. తాజా వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు.